Tuesday, 26 January 2021

భారత క్రికెటర్లకి ట్విస్ట్ ఇచ్చిన టీమ్ డాక్టర్..

 


ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముంగిట భారత క్రికెటర్లకి టీమ్ డాక్టర్ అభిజిత్ సాల్వి ఊహించని షాకిచ్చాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. టీమ్‌లోకి ఎంపికైన భారత క్రికెటర్లు బుధవారం ఉదయం మేనేజ్‌మెంట్‌కి చెన్నై హోటల్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే.. టీమ్‌తో చేరే ముందు ప్రతి క్రికెటర్ కోవిడ్-19 టెస్టుని చేయించుకుని రిపోర్ట్‌తో రావాలని అభిజిత్ ఆదేశాలు జారీ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.



చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 5 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. బుధవారం నుంచి బయో- సెక్యూర్ బబుల్‌లో భారత క్రికెటర్లు ఉండనున్నారు. మరోవైపు శ్రీలంక టూర్‌ని ముగించుకుని బుధవారం చెన్నైకి రానున్న ఇంగ్లాండ్ టీమ్ కూడా ఆరు రోజులు క్వారంటైన్‌ తర్వాత బబుల్‌లోకి రానుంది. అయితే.. భారత క్రికెటర్లకి ప్రత్యేకంగా హోటల్‌లో క్వారంటైన్ లేదు. కానీ.. ఇంటి వద్ద నుంచి వస్తుండటంతో కరోనా వైరస్ పరీక్ష చేయించుకుని రిపోర్ట్‌తో రావాలని మాత్రం సూచించినట్లు తెలుస్తోంది. భారత్ గడ్డపై 52 రోజులు ఇంగ్లాండ్ టీమ్ పర్యటించనుంది.

భారత్, ఇంగ్లాండ్ మధ్య వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. తొలి రెండు టెస్టులకి చెపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చెపాక్‌లోకి ప్రేక్షకుల్ని అనుమతించబోమని తమిళనాడు క్రికెట్ అసోషియేషన్ ఇప్పటికే ప్రకటించింది.